పెత్తందార్లు, భూస్వాములు రాజకీయాలలో ప్రవేశించి ప్రజలను దోచుకుంటున్నారని తమిళగ వెట్రి కళగం(Tamilaga Vettri Kazhagam) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ సినీ నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay) ఆరోపించారు. టీవీకే గెలిచిన తరువాత సామాన్యులకు రాజ్యాధికారం కల్పిస్తామని అని స్పష్టం చేశారు. 2026లో జరిగే ఎన్నికల్లో టీవీకే గెలిచి తమిళనాడు చరిత్రను తిరగరాస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహాబలిపురంలో టీవీకే పార్టీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) కూడా హాజరయ్యారు. తన పార్టీలోకి కీలక నేతల చేరికలు త్వరలోనే జరగనున్నాయని విజయ్ తెలిపారు.
హిందీ వివాదం.. విజయ్ సెటైర్లు
తమిళనాడు(Tamil Nadu) రాజకీయాల్లో ముదురుతున్న హిందీ వివాదంపై కూడా విజయ్ స్పందించారు. ఈ సందర్భంగా కేంద్రం, డీఎంకేపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. నూతన విద్యావిధానం, త్రిభాషా సూత్రం అమలుపై డీఎంకే, బీజేపీలు పరస్పరం విభేదిస్తూ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ గేమ్స్ ఆడుకుంటున్నాయన్నారు. ఇది చిన్నపిల్లల గొడవలా మారిందని ఎద్దేవా చేశారు.
విజయ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తమిళనాడులో హిందీ భాషకు వ్యతిరేకంగా అనేక కాలంగా తీవ్ర వ్యతిరేకత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజా వివాదంపై విజయ్ చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపే అవకాశముంది.