భారతీయ రైల్వే అభివృద్ధి పథంలో మరో పెద్ద అడుగుగా, వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ విజయవంతమైంది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా వేదికగా ఈ వార్తను ప్రకటించారు. 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసినప్పటికీ రైలు సజావుగా సాగడం, ట్రేపై నీటి గ్లాసు కూడా తొణకకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ పరీక్షలను రాజస్థాన్లోని కోటా రైల్వే డివిజన్లో నిర్వహించారు.
రైల్వే టెక్నాలజీలో కొత్త మైలురాయి
వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభించి కొత్త మార్గాల్లో ప్రయాణించడానికి సిద్ధమవుతోంది. న్యూఢిల్లీ-పూణే, న్యూఢిల్లీ-శ్రీనగర్ వంటి మార్గాల్లో ఈ రైళ్లు రానున్నాయి. ప్రస్తుతం, రైలు వేగాన్ని మెరుగుపరచడానికి పలు ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. రైలు మొదట 130 కిలోమీటర్ల వేగంతో నడపగా, ఇప్పుడది 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని చేరుకుంది. ఈ రైల్లో మొత్తం 16 బోగీలు ఉంటాయి. అందులో 10 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, ఒక ఫస్ట్ ఏసీ బోగీతో పాటు సీటింగ్ మరియు లగేజీ కోసం రెండు ప్రత్యేక బోగీలు ఉంటాయి.
త్వరలో పట్టాలపైకి
వచ్చే నెలలో మరిన్ని పరీక్షలు నిర్వహించి, రైలును ప్రయాణికుల సేవకు అందుబాటులోకి తెచ్చే అవకాశాలున్నాయి. వందే భారత్ స్లీపర్ రైలు భారత రైల్వే టెక్నాలజీ అభివృద్ధిలో కొత్త అధ్యాయాన్ని సృష్టించనుంది.