ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ (Central Cabinet Meeting) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలోని క్రీడా రంగాన్ని (Sports Sector) బలోపేతం చేయడంపై దృష్టి సారించిన కేంద్రం, జాతీయ క్రీడా విధానానికి (National Sports Policy) పచ్చజెండా ఊపింది. దీంతో పాటు ఉపాధి లింక్డ్ ప్రోత్సాహక పథకానికి మరియు పరిశోధనాభివృద్ధి, ఆవిష్కరణ పథకాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఉపాధి కల్పనకు భారీ ప్రోత్సాహం
ఉత్పాదక రంగంలో ఉద్యోగ కల్పనను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా రాబోయే రెండేళ్లలో (ఆగస్టు 1, 2025 నుంచి జూలై 31, 2027 వరకు) 3.5 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం ₹99,446 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. కొత్తగా ఉద్యోగం కల్పించే కంపెనీలకు ప్రతినెల ₹3,000 చొప్పున రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం చెల్లించనుంది. ₹1 లక్ష లోపు జీతం వచ్చే ఉద్యోగులకు ఈ ప్రోత్సాహం వర్తిస్తుంది. అలాగే, ఈపీఎఫ్ (EPF) రెండు వాయిదాలలో కేంద్ర ప్రభుత్వం చెల్లించనుంది.
పరిశోధన, ఆవిష్కరణలకు ఊతం
పరిశోధనాభివృద్ధి (R&D) మరియు ఆవిష్కరణ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం కోసం ₹1 లక్ష కోట్ల రూపాయలు కేంద్రం ఖర్చు చేయనుంది. ఆర్అండ్డి రంగంలో ప్రైవేట్ రంగం పెట్టుబడులను ప్రోత్సహించడానికి తక్కువ లేదా 0 వడ్డీరేట్లతో దీర్ఘకాలిక ఫైనాన్స్ను ప్రభుత్వం అందించనుంది.
మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత
మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా, తమిళనాడులోని పారమాకుడి-రామంతపురం సెక్షన్ మధ్య నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ కోసం కేంద్రం ₹1,853 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది.








