తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. హిందూ సంఘాలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తూ, సనాతన ధర్మాన్ని అవమానపరిచారని పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను విచారించడానికి నిరాకరించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం రిట్ పిటిషన్లను ఎలా కొనసాగించగలరని జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ ప్రసన్న బి వరాలే ధర్మాసనం ప్రశ్నించింది. ఈ తీర్పుతో ఉదయనిధి స్టాలిన్కు మద్దతు లభించినట్లైంది. అనంతరం పిటిషన్లను వెనక్కి తీసుకునేందుకు, చట్ట ప్రకారం ప్రత్యామ్నాయ పరిష్కారాలకు పిటిషనర్లకు కోర్టు అనుమతించింది. ఇది సామాజిక వర్గాల్లో కొత్త చర్చలకు దారితీస్తోంది.