ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై ఐదు వారాలు గడిచింది. ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు సతమతమవుతున్నాయి. ఇప్పటికే అనేక దేశాల్లో చమురు సంక్షోభం నెలకొంది. హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలు విధించడంతో పరిస్థితి రోజు రోజుకూ మరింత దిగజారుతోంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ (Operation Epic Fury)ను ముగించడానికి తాను సిద్ధంగా ఉన్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సహాయకులకు చెప్పినట్లు ఉన్నతాధికారులను ఉటంకిస్తూ “ది వాల్ స్ట్రీట్ జర్నల్” నివేదించింది.
హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పూర్తిగా తెరుచుకోకపోయినా యుద్ధానికి స్వస్తి పలకాలని భావిస్తున్నట్లు ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ ఓ నివేదికలో వెల్లడించింది. ఈ వార్త ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్ కలిగించనుంది. ఇక యుద్ ప్రారంభంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరు వారాల్లోపు యుద్ధం ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కానీ.. ఆ తరువాత జరిగిన అనేక పరిణామాల నేపథ్యంలో యుద్ధం ఐదు వారాలు పూర్తి చేసుకుంది. ఇక హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించడం అనేది అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ అని, అది యుద్ధ కాలాన్ని మరింత పొడిగిస్తుందని తాజాగా ట్రంప్ భావిస్తున్నారు.
అందుకే ప్రస్తుతానికి ఆ జలసంధిని ఇరాన్ నియంత్రణలోనే వదిలేసి, తన ప్రధాన లక్ష్యాలైన ఇరాన్ నౌకాదళాన్ని బలహీనపరచడం, క్షిపణి నిల్వలను ధ్వంసం చేయడంపైనే దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ దౌత్యపరంగా ఆ మార్గం తెరుచుకోకపోతే, యూరప్ మరియు గల్ఫ్ దేశాల సహాయంతో తర్వాత చర్యలు తీసుకోవచ్చని ఆయన యోచిస్తున్నారు. మంగళవారం జరిగిన వైట్ హౌస్ బ్రీఫింగ్లో ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ మాట్లాడుతూ.. చమురు ట్యాంకర్ల సురక్షిత ప్రయాణాన్ని పునరుద్ధరించడం అనేది యుద్ధాన్ని ముగించడానికి ట్రంప్ నిర్దేశించుకున్న ‘ప్రధాన లక్ష్యాల్లో’ ఒకటి కాదని స్పష్టం చేయడం ఆసక్తికరంగా మారింది.







