ఏపీలోని కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గిరిజన గురుకులాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు వినూత్న నిరసన చేపట్టారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. తమ సమస్యల పరిష్కారం కోసం గత 30 రోజులుగా సామూహిక నిరాహార దీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడాన్ని వారు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని గత నెల రోజులుగా గిరిజన గురుకులాలకు చెందిన అవుట్ సోర్సింగ్ టీచింగ్ స్టాఫ్ రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. వీరికి యూటీఎఫ్ సైతం మద్దతు ప్రకటించింది.
తమ నిరసనకు ప్రభుత్వ స్థాయిలో ఎటువంటి స్పందన లేకపోవడం దారుణమని అంటున్నారు. తమకు న్యాయం కావాలని, ప్రభుత్వం ప్రభుత్వం, సంబంధిత మంత్రులు ఈ అంశంపై స్పందించి సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.