సరదాగా చేస్తున్న సోషల్ మీడియా రీల్స్ ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. వీడియో చిత్రీకరిస్తూ అదుపుతప్పి భవనం పైనుంచి కిందపడి 13 ఏళ్ల బాలిక మృత్యువాత పడిన ఘటన ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
నేపాల్ దేశానికి చెందిన ధను బహదూర్ జీవనోపాధి కోసం తిరుపతికి వలస వచ్చారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజారెడ్డి నగర్లో ఉన్న ‘సాయి నివాస్’ అపార్ట్మెంట్లో ఆయన వాచ్మెన్గా పనిచేస్తూ, తన కుటుంబంతో కలిసి అక్కడే నివసిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన కుమార్తె పుష్ప (13) సోషల్ మీడియా కోసం వీడియోలు (రీల్స్) చేసే క్రమంలో అపార్ట్మెంట్ ఐదో అంతస్తుపైకి వెళ్లింది.
వీడియో తీస్తూ పరధ్యానంలో ఉన్న పుష్ప, ప్రమాదవశాత్తూ అదుపుతప్పి ఐదో అంతస్తు నుంచి కింద పడిపోయింది. కొద్దిసేపటి తర్వాత కుమార్తె కనిపించకపోవడంతో తల్లి కాజల్ వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ కింద రక్తపు మడుగులో పడి ఉన్న పుష్పను చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తీవ్ర గాయాలైన బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న అలిపిరి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.
సోషల్ మీడియా పిచ్చితో ప్రమాదకరమైన ప్రదేశాల్లో, భవనాల పైకప్పుల చివర నిలబడి వీడియోలు చేయడం ప్రాణసంకటంగా మారుతోందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని వారు కోరుతున్నారు.









“హీరోలకు 90 రోజులకు ఒకసారి డ్రగ్స్ టెస్ట్ చేయాలి”