వేసవి సెలవుల్లో తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ, సిఫార్సు లేఖలపై దర్శనాలను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని టీటీడీ బోర్డు సభ్యుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడించారు.
మే, జూన్ నెలలలో వేసవి సెలవులు కారణంగా కుటుంబాలతో తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని తెలిపారు. సాధారణ భక్తులకు ఎక్కువ అవకాశాలు కల్పించేందుకు వీఐపీ, సిఫార్సు దర్శనాలపై ఈ నిబంధనలు అమలులోకి తీసుకురావడమయ్యిందని చెప్పారు. ఈ నిర్ణయం మే 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు అమలులో ఉంటుందని, సిఫారసు లేఖలతో పాటు, బ్రేక్ దర్శనాలు, సుప్రభాతం దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు నెహ్రూ వెల్లడించారు. కాగా, వేసవి కారణంగా ఈ రెండు నెలల పాటు ప్రత్యేక దర్శనాలు అందుబాటులో ఉండవని, సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెప్పుకొచ్చారు.