తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (Tirumala Milk Products Private Limited)లో ట్రెజరీ మేనేజర్ (Treasury Manager ) మృతి (Death) సంచలనం రేపుతోంది. మేనేజర్ నవీన్ బొల్లినేని (Naveen Bollineni) (38) చెన్నై (Chennai)లోని బ్రిటానియా నగర్ (Britannia Nagar)లోని తన నివాసంలో బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న ఘటన పలు అనుమానాలకు తావిస్తోంది. కృష్ణా జిల్లాకు చెందిన నవీన్ తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ట్రెజరీ మేనేజర్గా పనిచేస్తున్నాడు. కంపెనీ నిధుల్లో రూ.45 కోట్ల మేర మనీలాండరింగ్ (Money Laundering) జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఆత్మహత్య జరిగినట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నవీన్పై ఎలాంటి అధికారిక ఫిర్యాదు లేనప్పటికీ, అరెస్ట్ భయంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నవీన్ బొల్లినేని తన తల్లి, సోదరి, కొందరు సహోద్యోగులకు ఈమెయిల్ ద్వారా సూసైడ్ నోట్ పంపినట్లు సమాచారం. ఈ ఈమెయిల్లో, కంపెనీలోని కొందరు ఉన్నతాధికారులు తనపై మానసిక ఒత్తిడి కలిగించారని, రూ.45 కోట్ల నిధుల దుర్వినియోగ ఆరోపణల నేపథ్యంలో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. నవీన్ ఇప్పటికే రూ.5 కోట్లు కంపెనీకి తిరిగి చెల్లించినట్లు సమాచారం.
అయితే, చెన్నై పోలీసులు నవీన్పై ఎలాంటి అధికారిక ఫిర్యాదు లేదని, అతన్ని విచారణకు పిలవలేదని స్పష్టం చేశారు. తిరుమల మిల్క్ ప్రోడక్ట్స్ లీగల్ మేనేజర్ మహ్మద్ తమీముల్ అన్సారీ జూన్ 24న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ)కి, జూన్ 25న కొలత్తూర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది, కానీ ఇంకా దర్యాప్తు ప్రారంభం కాలేదు. అయితే ఇది ఆత్మహత్య కాదు.. హత్య అని మృతుడి కుటుంబీకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై పోలీసులు ఈ ఘటనను అనుమానాస్పద మరణంగా నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. నవీన్ శవాన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్టాన్లీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు.