తిరుమలలో ప్రసిద్ధి చెందిన లడ్డూ కౌంటర్ల వద్ద జరిగిన అగ్ని ప్రమాదం భక్తులను ఒక్కసారిగా భయభ్రాంతులకు గురి చేసింది. 47వ నెంబర్ కౌంటర్ వద్ద కంప్యూటర్ యూపీఎస్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
వేగంగా సిబ్బంది స్పందన
అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న వెంటనే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. లడ్డూ కౌంటర్ల వద్ద నిత్యం భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల, ఈ ఘటన ఒక్కసారిగా అలజడికి దారితీసింది. కలియుగ దైవం కొలువైన కొండపై ఇటీవల జరుగుతున్న ఘటనలపై భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
భక్తుల కదలికల్లో మార్పు
తిరుపతి తొక్కిసలాట ఘటన తర్వాత తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిందని సమాచారం. అలాంటి సమయంలో ఈ ఘటన భక్తుల్లో మరింత ఆందోళన కలిగించింది. భక్తులు తమ దర్శనాలు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సిబ్బంది సూచిస్తున్నారు.