కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) కొలువైన తిరుమల (Tirumala) కొండపై జరుగుతున్న వరుస సంఘటనలు భక్తులను ఆగ్రహానికి, ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల శ్రీవారి కొండపై మాంసాహార పదార్థాలు బయటపడగా, తాజాగా ఏకంగా మద్యం బెల్ట్ షాప్ (Liquor Belt Shop) కలకలం సృష్టిస్తోంది. తిరుమల క్షేత్రాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అలాంటి దివ్యక్షేత్రంలో మద్యం (Liquor), మాంసం (Meat) విక్రయాలు భక్తులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి.
కొందరు దుండగులు అక్రమ మార్గాల్లో తిరుమల కొండపై మద్యం, మాంసం తీసుకెళ్లే విక్రయాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా, శనివారం రమేష్ (Ramesh) అనే వ్యక్తి తిరుమలలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి, ఎక్సైజ్ పోలీసులు (Excise Police) అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి మూడు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు. బాలాజీ నగర్ (Balaji Nagar) లో నివాసం ఉండే రమేష్, తిరుమలకు మద్యం అక్రమంగా తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనపై అధికారులు అప్రమత్తమై తిరుమల ప్రాంతంలో తనిఖీలు మరింత కఠినతరం చేశారు.
తిరుమల పవిత్రతను భంగం కలిగించే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. భక్తులు కూడా ఇలాంటి అక్రమ కార్యకలాపాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పవిత్రమైన క్షేత్రంలో ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు ఎలాంటి అవకాశం ఉండకూడదని, కఠినమైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.