నంద్యాల జిల్లా (Nandyala district) కొత్తపల్లి మండలం సింగరాజుపల్లె (Singarajupalle) గ్రామ సమీప అటవీ ప్రాంతంలో పెద్దపులి (Tiger) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన (Died) ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సింగరాజుపల్లె గ్రామ శివారులో ఉన్న గంగిరేవు చెరువు (Gangirevu Pond) అటవీ ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ పెద్దపులి మృతి జరిగినప్పటికీ దాదాపు 20 రోజుల పాటు ఆ విషయాన్ని ఎవరికీ తెలియకుండా ఉంచినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఈ విషయం వెలుగులోకి రావడంతో అటవీశాఖ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.
ఇదిలా ఉండగా, నల్లమల అటవీ ప్రాంతంలో (Nallamala Forest Area) జరుగుతున్న ఈ తరహా ఘటనలను అటవీశాఖ అధికారులు (Forest Department Officials) గోప్యంగా ఉంచుతున్నారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులి మృతి కేసులో డిప్యూటీ డైరెక్టర్ (Deputy Director) సాయిబాబా (Saibaba) నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు. పులి మృతి విషయంలో అనేక అనుమానాలు ఉన్నా, అధికారులు మాత్రం అది అనారోగ్య కారణాలతో మృతి చెందిందని చెబుతుండటం ప్రశ్నార్థకంగా మారింది. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించేందుకు రెగ్యులర్ డీఎఫ్ఓతో (Regular DFO) పాటు ఓ ట్రైనీ డీఎఫ్ఓను కూడ రంగంలోకి దింపినట్టు సమాచారం.
గతంలో అదే ప్రాంతానికి సమీపంగా ఉన్న పెద్ద గుమ్మడాపురం గ్రామ అటవీ ప్రాంతంలో ఒక ఆడ పెద్దపులి మృతి చెందిన ఘటన గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆ పులికి చెందిన నాలుగు పిల్లలను తిరుపతి జూకు తరలించారు. ఆ పెద్దపులిని వేటగాళ్లు చంపినట్టు అనుమానాలు వ్యక్తమవగా, తాజాగా మృతి చెందిన ఈ పులిని కూడా అదే విధంగా వేటగాళ్లు లక్ష్యంగా చేసుకుని ఉండొచ్చని అంటున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను అటవీశాఖ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబా వెల్లడించనున్నారు.