ఇది తొలి హెచ్చ‌రిక‌.. కూట‌మి ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ ఫైర్‌

ఇది తొలి హెచ్చ‌రిక‌.. కూట‌మి ప్ర‌భుత్వంపై జ‌గ‌న్ ఫైర్‌

యువ‌త‌, నిరుద్యోగుల ప‌క్షాన ప్ర‌తిప‌క్ష వైసీపీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేప‌ట్టిన యువ‌త పోరు విజ‌య‌వంత‌మైంది. పోలీసుల ఆంక్ష‌లు అరెస్టుల‌ను లెక్క చేయ‌కుండా వైసీపీ నేత‌లు భారీ ర్యాలీల‌తో బ‌య‌ల్దేరి జిల్లా క‌లెక్ట‌రేట్‌ల‌లో విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించారు. కూట‌మి ప్ర‌భుత్వం ఫీజురీయింబ‌ర్స్‌మెంట్ ప‌థ‌కం ద్వారా విద్యార్థుల‌కు ప‌డ్డ బాకీ ఎంతో లెక్క‌ల‌తో స‌హా వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌కు, విద్యార్థుల‌కు, ప్ర‌భుత్వానికి వివ‌రంగా చెబుతూ చేసిన ట్వీట్‌కు ఓ టేబుల్‌ను జ‌త చేశారు. ఈ సంద‌ర్భంగా కూట‌మి ప్ర‌భుత్వంపై ఘాటు విమ‌ర్శ‌లు చేశారు. ఈ ఆందోళన విజయవంతం కావడాన్ని తొలి హెచ్చరికగా అభివర్ణించారు.

చంద్ర‌బాబు పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైసీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా “యువత పోరు’’ ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని వైఎస్ జ‌గ‌న్ పేర్కొన్నారు. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి ఈ సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారని, నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది చంద్రబాబు అని సూచించారు.

పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవ్వరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను, వసతి దీవెన ద్వారా హాస్టల్‌, మెస్‌ ఛార్జీలను నేరుగా వారి తల్లులు, ఆ పిల్లల ఖాతాలకే జమచేస్తూ, అమలు చేసిన ఈ పథకాలను చంద్ర‌బాబు ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందన్నారు. చంద్రబాబు త‌న గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ తిరిగి తీసుకు వచ్చారని వైఎస్ జ‌గ‌న్ గుర్తుచేశారు.

2024 జనవరి – మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బును ఏప్రిల్‌లో వెరిఫై చేసి, మేలో చెల్లించాల్సి ఉంద‌న్నారు. అక్కడ నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు ఇవ్వాలన్నారు. వసతి దీవెన కింద హాస్టల్‌ ఖర్చులకు మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలని చెప్పారు. ప్రతి ఏడాదికి ఈ రెండు పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాల‌న్నారు.

కానీ చంద్రబాబు కేవలం రూ. 700 కోట్లు మాత్ర‌మేన‌ని, అదికూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదని, అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టిన రూ.3,200 కోట్లు, అదీ కాక ఈ ఏడాది ఖర్చుచేయాల్సిన మరో రూ. 3,900 కోట్లు, రెండూ కలిపితే రూ.7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చుపెట్టాలని వైఎస్ జ‌గ‌న్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. దీని అర్థం పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్టే కదా ? అని లాజికల్ క్వ‌శ్చ‌న్ వేశారు. ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? చదువుకుంటున్న పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు అని ప్ర‌శ్నించారు.

అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా అందాక నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్ర‌బాబు.. ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారని వైఎస్ జ‌గ‌న్ ఫైర్ అయ్యారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రతి ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలని, కానీ, గతేడాది బడ్జెట్లో ఒక్కపైసా కేటాయింపూ లేదని గుర్తుచేశారు. ఈ ఏడాదికి కూడా ఒక్కపైసా కేటాయించలేదని చెప్పారు. ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికీ రూ.72వేల చొప్పున బకాయి పడ్డారని, అలాగే వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రయివేటు పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకోవడమే కాకుండా పేద విద్యార్థులకు మెడికల్‌ విద్యను దూరం చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.

కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాదికూడా కాకముందే ప్ర‌భుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబు అని వైఎస్ జ‌గ‌న్ ప్ర‌శ్నించారు. ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై, వారికోసం చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ “యువత పోరు’’ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలందర్నీ అభినందిస్తున్నాన‌ని, అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల సహా అన్నివర్గాలకూ వైసీపీ ఎప్పుడూ తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తూ వైఎస్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment