జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఎమ్మెల్సీ రేసు నుంచి తప్పుకున్నారు. ఈ వార్త ప్రస్తుతం కూటమి పార్టీల్లో హల్చల్ చేస్తోంది. మంత్రి అవుతానని ఆశలు పెట్టుకున్న నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవితో సరిపెట్టుకోవాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి అవుతానని ఇన్నాళ్లూ ఆశలు పెట్టుకున్న నాగబాబు కూటమి నిర్ణయంతో నిరాశ చెందినట్లుగా తెలుస్తోంది. పార్టీ కోసం కష్టపడ్డారని చెప్పుకునే సొంత అన్నకు కూడా పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేకపోయారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తన అన్నను ఎమ్మెల్సీని చేసి మంత్రిగా ప్రమోట్ చేయాలని గతంలో పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుకు ప్రతిపాదన పంపించారు. దీనికి చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించి నాగబాబును మంత్రిని చేస్తామని పత్రికా ప్రకటన సైతం విడుదల చేశారు. కాగా, జనసేనలో ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే మంత్రి పదవులు అని విమర్శలు రావడంతో డిప్యూటీ సీఎం మీడియా ముందుకు వచ్చి తన సోదరుడు నాగబాబు పార్టీ కోసం తనలానే కష్టపడ్డారని, జనసేన ఆశయాల కోసం ఎన్నో త్యాగాలు చేశారని చెప్పారు.
నాగబాబును ఎంపీ నుంచి రీకాల్ చేసి ఎమ్మెల్సీగా ప్రతిపాదిస్తున్నామని చెప్పిన పవనే.. ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వార్త జనసేనలోని నాగబాబు అనుచరులకు మింగుడుపడడం లేదు. బీజేపీ కోసం పవన్ వెనక్కు తగ్గారా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సీఎం ఢిల్లీ పర్యటన అందుకేనా..?
ఎమ్మెల్యే కోటాకు సంబంధించి 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల కాగా, నిన్నటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఐదు స్థానాల్లో బీజేపీకి ఒకటి, టీడీపీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు పంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఒకటితో సంతృప్తి చెందని బీజేపీ మరో స్థానం కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. రెండు ఎమ్మెల్సీలతో పాటు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటుపై కూడా బీజేపీ కన్నుపడిందని, ఆ స్థానాన్ని కూడా దక్కించుకునేందుకే సీఎం చంద్రబాబును ఢిల్లీకి పిలిపించుకున్నారని ఏపీ బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు.