నేడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో పట్టణ రాజకీయాలు హీట్ పెరిగాయి. మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే గడువు ఉండటంతో మున్సిపాలిటీల్లో అభ్యర్థులు, పార్టీ నేతల హడావిడి కనిపిస్తోంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోని 2996 వార్డులకు గాను ఏకంగా 19,608 నామినేషన్లు దాఖలవడం ఈ ఎన్నికలపై ఉన్న ఆసక్తిని స్పష్టంగా చూపిస్తోంది. నామినేషన్ల ఉపసంహరణ పూర్తయ్యాక స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల గుర్తుల కేటాయింపు జరగనుండగా, తుది పోటీదారుల జాబితాతో ప్రచారం మరింత జోరందుకోనుంది.
ఇదిలా ఉండగా, కొన్ని పార్టీల్లో ఇంకా అన్ని వార్డులకు బిఫారాలు ఖరారు కాకపోవడం రాజకీయ ఉత్కంఠకు కారణమవుతోంది. నామినేషన్ల ఉపసంహరణతో పాటు బిఫారాల సమర్పణకూ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలే చివరి గడువు కావడంతో పార్టీలు తుది నిర్ణయాలపై ఫోకస్ పెట్టాయి. బిఫారం దక్కని నేతలు స్వతంత్రులుగా బరిలోకి దిగితే అధికార, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులకు ఇబ్బందులు తప్పవన్న అంచనాలు ఉన్నాయి. దీంతో రెబల్ అభ్యర్థులను బుజ్జగించేందుకు అగ్రనేతలు కీలక భేటీలు, హామీలతో రంగంలోకి దిగారు. రానున్న గంటలు తెలంగాణ మున్సిపల్ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి.








