తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన సందర్భంగా మంత్రివర్గ విస్తరణ అంశం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు మదన్ మోహన్, మల్రెడ్డి రంగారెడ్డి ఢిల్లీకి చేరుకుని, రేవంత్ రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయ్యి చర్చ జరిపినట్లుగా సమాచారం. కాగా, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి మంత్రివర్గంలో తనకు ఈసారి అవకాశం దక్కుతుందని ధీమాగా ఉన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినప్పటికీ ఇప్పటికీ మంత్రివర్గ కూర్పులో తీవ్ర జాప్యం జరుగుతోంది. కీలక శాఖలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ వద్దే ఉన్నాయి.
భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు
మంత్రివర్గ విస్తరణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాల మేరకే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ రూల్స్ను మార్చడం, చెరువుల ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలను సైతం భట్టి ప్రస్తావించారు. హైడ్రాకు ఎలాంటి భేదభావం లేదని, చెరువులను ఎవరు ఆక్రమించినా కఠిన చర్యలు తీసుకుంటామని భట్టి విక్రమార్క తేల్చిచెప్పారు.








