తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీరు సంచలనంగా మారింది. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన తరువాత ఆయన మాటల్లో జోరు పెరిగింది. సీఎం రేవంత్రెడ్డిపై చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన తీవ్రమైన విమర్శలు చేశారు. కులగణన విషయంలో తనను సస్పెండ్ చేయడాన్ని తప్పుబట్టారు. “కులగణన తప్పు అని పత్రాలు తగలబెడితే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా?” అని మల్లన్న ప్రశ్నించారు.
రేవంత్పై మల్లన్న తీవ్ర విమర్శలు
మల్లన్న మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి కావాలనే తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని ఆరోపించారు. “రాహుల్ గాంధీ తలెత్తుకునేలా కులగణన జరగాలని రేవంత్కి సూచించాను. అందుకే నన్ను సస్పెండ్ చేయాలని ఆయన అనుకున్నారు” అని చెప్పారు. బీసీ జనాభా తగ్గించడంపై కూడా మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. “EWS రిజర్వేషన్ల రక్షణ కోసమే బీసీ జనాభా తగ్గించారు. కేసీఆర్ చేసిన సర్వే కంటే ఇది మరింత దారుణంగా ఉంది” అని విమర్శించారు.
బీసీల కోసం పోరాటం
“కులగణన చేస్తారనే హామీతోనే కాంగ్రెస్లో చేరాను. కానీ బీసీలకు న్యాయం జరగడం లేదు” అని మల్లన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో తన పాత్ర ఉందని, కానీ ఇప్పుడు బీసీల హక్కులు పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. “2028లో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆ దిశగా అన్ని బీసీ సంఘాలను ఏకం చేస్తాం” అని మల్లన్న స్పష్టం చేశారు.