ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ చేతిలో 5 వికెట్ల తేడాతో భారత్ పరాజయం పాలైంది. 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో బెన్ డకెట్ (149) భారీ శతకంతో చెలరేగగా, జాక్ క్రాలీ (65), జో రూట్ (53 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు.
బౌలింగ్, ఫీల్డింగ్ వైఫల్యం
రెండో ఇన్నింగ్స్లో భారత బౌలర్లు తేలిపోయారు. ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా, జడేజా ఒక వికెట్ సాధించాడు. అయితే, తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లతో సత్తాచాటిన జస్ప్రీత్ బుమ్రా.. రెండో ఇన్నింగ్స్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
అంతేకాకుండా, చెత్త ఫీల్డింగ్ కూడా టీమిండియాను దెబ్బతీసింది. రెండు ఇన్నింగ్స్లు కలిపి భారత ఫీల్డర్లు ఏడు క్యాచ్లను జారవిడిచారు. అందులో నాలుగు క్యాచ్లు యశస్వి జైశ్వాల్ వదిలేసినవే కావడం గమనార్హం. ఈ విజయంతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
అత్యంత చెత్త రికార్డు టీమిండియా పేరిట
ఈ ఓటమితో భారత్ అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఒక టెస్టులో ఐదు సెంచరీలు నమోదు చేసిన తర్వాత కూడా ఓటమి పాలైన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. 148 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ జట్టు కూడా ఈ చేదు రికార్డును నమోదు చేయలేదు. తాజా ఓటమితో టీమిండియా ఈ ఘోర అప్రతిష్టను మూటగట్టుకుంది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జూలై 2 నుంచి ఎడ్జ్ బాస్టన్ వేదికగా ప్రారంభం కానుంది.
టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ – తొలి టెస్ట్ మ్యాచ్ ఈనెల 20 తేదీన హెడింగ్లీ, లీడ్స్ మైదానంలో ప్రారంభమైంది. టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 471 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 10 వికెట్లు కోల్పోయి 465 చేసింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియాకు ఆరు పరుగుల ఆధిక్యం లభించగా, టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 364 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఆ తరువాత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి, ఐదు వికెట్ల తేడాతో టీమిండియాపై ఇంగ్లండ్ విజయం సాధించింది.