పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు రెచ్చిపోయారు. దైవ దర్శనానికి వచ్చిన జెడ్పీటీసీ దంపతులను ఆలయంలోనే నిర్బంధించారు. గుడి చుట్టూ మోహరించిన టీడీపీ నేతలు అడుగుపెడితే చంపేస్తామని వైసీపీకి చెందిన జెడ్పీటీసీ దంపతులను వేధింపులకు గురిచేశారు. పోలీసుల ఆదేశాలను కూడా లెక్క చేయకుండా దారుణంగా ప్రవర్తించారు.
దైవదర్శనం నిమిత్తం పెద్దకూరపాడు మండలం గార్లపాడులోని ఆలయానికి వైసీపీ జెడ్పీటీసీ స్వర్ణకుమారి దంపతులు చేరుకున్నారు. సమాచారం అందుకొని మూకుమ్మడిగా తరలివచ్చి టీడీపీ నేతలంతా జెడ్పీటీసీ దంపతులపై దాడికి యత్నించారు. వారు ఆలయం నుంచి ఎంతకీ బయటకు రాకపోవడంతో గుడి చుట్టూ మోహరించారు. దీంతో వారు ఆలయంలోనే తలదాచుకున్నారు. ఉదయం 10:30 గంటలకు ఆలయంలోకి వెళ్లిన జెడ్పీటీసీ దంపతులు.. ఆరు గంటలుగా గుడిలోనే నిరీక్షిస్తున్నారు.
గుడి నుంచి బయటకు అడుగుపెట్టిన వెంటనే చంపేస్తామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. దీంతో జెడ్పీటీసీ దంపతులు పోలీసులు సమాచారం అందించారు, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సైతం టీడీపీ నేతలను ఆలయం ప్రాంగణం నుంచి వెనక్కి పంపించలేకపోయారు. పోలీసుల మాటను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఖాతరు చేయడం లేదు. ఈ ఘటన టీడీపీ అరాచకాలకు అద్దం పడుతుండగా, ఉన్నతస్థాయి అధికారులైనా వచ్చి జెడ్పీటీసీ దంపతులను రక్షించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.







