టీడీపీ సీనియర్ నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా హాట్టాపిక్గా మారింది. “కష్టపడి సాధించే విజయానికి గౌరవం” అంటూ ట్వీట్ చేసిన వర్మ, కొద్దిసేపటికే దాన్ని డిలీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చివరి నిమిషంలో పిఠాపురం నుంచి పోటీ చేయడం, చంద్రబాబు వర్మను బుజ్జగించడంతో వర్మ వెనక్కి తగ్గారు. పవన్ను గెలిపించేందుకు వర్మ ప్రచారం చేయాల్సి రావడం, ఇప్పుడు ఈ ట్వీట్ వివాదం కొత్త చర్చలకు తావిస్తోంది.
వివాదాస్పద ట్వీట్ వెనుక నిజం
పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వర్మ జనసేన జెండాలతో ప్రచారం చేసిన వీడియో షేర్ చేశారు. కానీ, ఆ వీడియోలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కనిపించలేదు. వర్మ ప్రచారం చేసిన దృశ్యాలే అందులో ఉండటంతో, ఇది అనేక అనుమానాలకు తావిచ్చింది. ట్వీట్ మీద వివాదం రాగానే, వర్మ దాన్ని వెంటనే డిలీట్ చేశారు.
వర్మ వివరణ
ట్వీట్ మీద వివాదం చెలరేగడంతో వర్మ వివరణ ఇచ్చుకున్నారు. “సోషల్ ప్లానెట్”* అనే సంస్థ తన సోషల్ మీడియా అకౌంట్స్ నిర్వహిస్తోందని, తాను వ్యక్తిగతంగా ఈ పోస్ట్కు బాధ్యత వహించనని ఎక్స్లో (ట్విట్టర్) స్పష్టం చేశారు. తన అనుమతి లేకుండా తప్పుడు పోస్ట్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
వర్మ మాటలు నిజమేనా?
వర్మ ట్వీట్ వెనుక మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోషల్ ప్లానెట్ సంస్థ ప్రతినిధులు వర్మ అనుమతి లేకుండానే ట్వీట్ చేశామని ఒప్పుకున్నారు. కానీ, అసలు ట్వీట్ పెట్టింది వారేనా? లేక వర్మ సూచనతో జరిగిందా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.








