కర్నూలు జిల్లా సంచలనం సృష్టించిన టీడీపీ నేత సంజన్న హత్య కేసులో పోలీసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈనెల 14న శరీన్ నగర్లో హత్యకు గురైన సంజన్న కేసులో మొత్తం ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టైన వారిలో వద్దే రామాంజనేయులు, రేవంత్, తులసి, శివకుమార్, అశోక్ లు ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ వెల్లడించారు.
కుటుంబ తగాదాలే కారణం..
పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదాలు హత్యకు దారితీసినట్లుగా ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరించారు. హత్యకు గురైన సంజన్న కుటుంబానికి, నిందితుల కుటుంబానికి మధ్య గతం నుంచి వివాదాలు కొనసాగుతున్నట్లు గుర్తించామన్నారు. పరస్పరం కేసులు పెట్టుకోవడం, విభేదాలు తీవ్రరూపం దాల్చడంతో, నిందితులు కత్తులు, వేట కొడవళ్ళతో దాడి చేసి సంజన్నను హత్య చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో రౌడీ షీటర్లపై కర్నూలు పోలీసులు నిఘా పెంచినట్లుగా ఎస్పీ వివరించారు.