ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ సీనియర్ నేతలను లక్ష్యంగా చేసుకుని వరుస దాడులు జరుగుతున్నాయి. దాడులకు మాత్రమే పరిమితం కాకుండా ఏకంగా వైసీపీ నేతల ఇళ్లకు నిప్పుపెడుతున్నారు. నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబుపై హత్యాయత్నం జరిగిన మరుసటి రోజే, ఇవాళ కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ నివాసంపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి.
ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ నివాసంపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు, కత్తులు విసురుతూ దాడి చేశారు. దాడి సమయంలో ఇంటిపై టీడీపీ శ్రేణులు పెట్రోల్ బాంబ్ విసిరడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో జోగి రమేశ్ ఇంటి ఫస్ట్ ఫ్లోర్ కారిడార్లో మంటలు చెలరేగి, ఆ ప్రాంతం కాలిపోయింది.
మైలవరం నుంచి భారీ సంఖ్యలో టీడీపీ శ్రేణులు ఇబ్రహీంపట్నానికి చేరుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు భారీగా మోహరించినప్పటికీ, టీడీపీ శ్రేణులు అవేమీ పట్టించుకోకుండా దాడికి తెగబడ్డారు. దాడి సమయంలో ఇంట్లో జోగి రమేశ్ తండ్రి, భార్య, చిన్న పిల్లలు ఉన్నట్లు సమాచారం. దాడికి సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీంతో వైసీపీ శ్రేణులు జోగి రమేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు.
అంబటి రాంబాబు హత్యాయత్నం ఘటన మరవకముందే, మరో మాజీ మంత్రిపై ఈ తరహా దాడి జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వైసీపీ నేతలనే టార్గెట్గా చేసుకొని దాడులు చేస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో ఈ తరహా దాడులు గతంలో ఎన్నడూ లేవని, కూటమి ప్రభుత్వం కొత్త సంప్రదాయానికి తెరతీసిందని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నారు.








