తెలంగాణ రాజకీయం మొత్తం సంధ్య థియేటర్ అల్లు అర్జున్, తొక్కిసలాట ఘటనపైనే నడుస్తోంది. సంధ్య థియేటర్ ఘటనపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ అల్లు అర్జున్కు మద్దతుగా నిలవగా, అధికార కాంగ్రెస్ మాత్రం తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
ఇదిలా ఉంటే అల్లు అర్జున్ విచారణ పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమా హీరో అల్లు అర్జున్ను సీఎం రేవంత్రెడ్డి పర్సనల్గా టార్గెట్ చేస్తున్నాడని ఆరోపించారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం బాధాకరం అయినప్పటికీ, ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పినప్పటికీ టార్గెట్ చేస్తూ రాజకీయం చేయడం దుర్మార్గమన్నారు.
రేవంత్రెడ్డి సొంత అన్న టార్చర్ వల్ల ఒక రైతు సూసైడ్ చేసుకుంటే ఇప్పటి వరకు దానిపై కనీసం కేసు నమోదు కాలేదన్న అంశాన్ని హరీష్రావు లేవనెత్తారు. రాష్ట్రంలో 50 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే, రేవంత్ రెడ్డి కనీసం దాని మీద మాట్లాడలేదన్నారు. 500 మంది రైతులు, 80 మంది ఆటో డ్రైవర్లు చనిపోతే మాట్లాడటానికి రేవంత్రెడ్డికి సమయం లేదు, కానీ ఫిల్మ్ ఇండస్ట్రీని టార్గెట్ చేయడానికి మాత్రం సమయం ఉంది అంటూ హరీష్రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.