ఏపీ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత ఆర్కే రోజా తీవ్ర ఆరోపణలు చేశారు. సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు నేడు అప్పుల మీద అప్పులు చేస్తున్నాడని, యువత, మహిళలు, విద్యార్థులను మోసం చేసిన కూటమి ప్రభుత్వం, ఆరు నెలలకే ప్రజలకు నరకం చూపిస్తోందని అన్నారు. నగరిలో జరిగిన వైసీపీ సమీక్ష సమావేశంలో పార్టీకి చెందిన ప్రముఖ నేతలు, కార్యకర్తలు హాజరై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి ఆర్కే రోజా, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్కే రోజా మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని వైఎస్ జగన్ నెరవేర్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే హామీల అమలుపై జగన్ ధ్యాసపెట్టారని, కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు గడుస్తున్నా, ఎన్నికల వాగ్దానాలను పట్టించుకోవడం లేదన్నారు. చంద్రబాబు ప్రకటించింది సూపర్ సిక్స్ కాదు.. సూపర్ మోసం అని రోజా ఆరోపణలు చేశారు.
ప్రజలతో అండగా ఉండే నాయకత్వం
సమావేశంలో మాట్లాడిన ఎంపీ గురుమూర్తి, మాజీ ఎంపీ రెడ్డప్పలు కూడా కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందన్నారు. ప్రజల సమస్యలు, మహిళల భద్రత, విద్యార్థుల ప్రయోజనాల కోసం వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు.