భక్తులకు తిరుమల శ్రీవారి దర్శనాన్ని మరింత వేగవంతం చేయడానికి టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ఆధునిక టెక్నాలజీని ఉపయోగించడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. కేవలం 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని అమలు చేయాలనుకుంటున్నారు.
బెంగళూరుకు చెందిన ఓ సంస్థ టీటీడీ ఛైర్మన్ కార్యాలయంలో ఈ టెక్నాలజీకి సంబంధించిన డెమోను ప్రదర్శించింది. ఈ డెమోలో టోకెన్ జారీ, ఫేషియల్ రికగ్నిషన్, బ్యారియర్ గేట్ వద్ద ఆటోమెటిక్ ఓపెనింగ్
వంటి ప్రక్రియలను టీటీడీ అధికారులు వీక్షించారు. ఈ టెక్నాలజీ విజయవంతంగా అమలయ్యే సూచనలు కనిపిస్తున్నప్పటికీ, మరికొన్ని సంస్థల డెమోలను వీక్షించిన అనంతరం మెరుగైన సేవలు అందించే సంస్థను ఎంపిక చేస్తారు. ప్రాజెక్ట్ కోసం AI సాఫ్ట్వేర్ను అందించడానికి నాలుగు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తిని వ్యక్తం చేశాయి.