ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డయేరియా తాండవం చేస్తోంది. ఇటీవల గుంటూరు, విజయవాడలో కలకలం సృష్టించగా, తాజాగా శ్రీకాకుళం జిల్లాలో డయేరియా విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వ్యాధితో ఒకరు చనిపోగా సోమవారం మరొకరు చనిపోయారు. దీంతో మృతుల సంఖ్య రెండుకు చేరింది. మృతులను నర్సింగ్రావు, సురేష్లుగా గుర్తించారు.
శ్రీకాకుళంలో దాదాపు 75 మంది డయేరియా లక్షణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనాలతో బాధితులు వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. గోల్కొండ రేవు, దమల వీధి, బొడ్డెమ్మకోవెల మరియు మంగువారితోట వంటి జనసాంద్రత కలిగిన ప్రాంతాల నుండి ఈ ఇన్ఫెక్షన్ సోకినట్టు తెలుస్తోంది.
పిల్లలు వృద్ధులు ప్రభావితమైన వారిలో ఉన్నారు. దీంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. డయేరియా అధికారులు ఆలస్యంగా స్పందించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ ప్రాంతాల నుండి నీటి నమూనాలను సేకరించి, ఆలస్యం లేకుండా ప్రయోగశాల పరీక్షలకు పంపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.








