కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు కలిసి తెలంగాణకు కీలకమైన సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన కేటీఆర్.. “బీఆర్ఎస్ చెప్పింది నిజమవుతోంది. ఇప్పటికే రెండు బొగ్గు బ్లాకులను ప్రైవేటు కంపెనీలకు అప్పగించారు. ఇప్పుడు ఉన్నతస్థాయి ఉద్యోగాలనూ ప్రైవేటీకరణకు తీయడం మరో ప్రమాద ఘంటిక” అంటూ హెచ్చరించారు.
కార్మిక హక్కులకు ముప్పు
సింగరేణి లాభాల్లో కీలక పాత్ర పోషించిన కార్మికుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. “వందేళ్ల చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వ రంగ సంస్థను బలోపేతం చేయాల్సింది పోయి నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఇది కార్మికుల హక్కులకు ముప్పుగా మారనుంది” అని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు బహుజన ఉద్యమం ప్రారంభిస్తామని ప్రకటించారు. “కార్మికుల సంఘటిత శక్తిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చూపిస్తాం” అంటూ కేటీఆర్ జంగ్ సైరన్ మోగించేందుకు సిద్ధమయ్యారు.