విశాఖపట్నం (Visakhapatnam) సమీపంలోని సింహాచలం అప్పన్న స్వామి (Simhachalam Appanna Swamy) చందనోత్సవం (Chandanotsavam) విషాదంగా మారింది. స్వామివారి నిజరూప దర్శనం కోసం వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అయితే మంగళవారం అర్ధరాత్రి తర్వాత కురిసిన భారీ వర్షానికి ఆ ఉత్సవంలో హఠాత్తుగా దుర్ఘటనకు (Accident) దారితీసింది. రూ.300 టికెట్ క్యూలైన్ వద్ద గోడ (Wall) ఒక్కసారిగా కుప్పకూలిపోయి భక్తులపై పడింది. ఈ విషాదకర సంఘటనలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
చందనోత్సవం (Chandanotsavam) పనుల్లో భాగంగా ఈ గోడను నిర్మించినట్లుగా తెలుస్తోంది. గోడ నాసీరకంగా నిర్మించడం వలనే కూలిపోయి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే ఎస్డీఆర్ఎఫ్ (SDRF) బృందం ఆలయానికి చేరుకొని శిథిలాలను తొలగించి భక్తుల మృతదేహాలను వెలికి తీసింది. అప్పన్న నిజరూప దర్శనానికి (Appanna Nijaroopa Darshanam) వచ్చిన భక్తులు అనంతలోకాలకు వెళ్లడం కుటుంబ సభ్యులను, స్థానికులను తీవ్రంగా కలచివేస్తోంది.
బాధాకరం.. విచారణ జరిపించాలి : ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సింహాచలం అప్పన్న ఆలయంలో ప్రమాదం జరిగిన స్థలాన్ని వైసీపీ మహిళా అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, జడ్పీ ఛైర్ పర్సన్ సుభద్ర పరిశీలించారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. 8 మంది భక్తులు చనిపోవడం బాధ కలిగిందని, చరిత్రలో ఎన్నడూ ఇలాంటి ఘటన జరగలేదన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోందని జడ్పీ ఛైర్ పర్సన్ సుభద్ర ఆరోపించారు. భక్తుల మృతి ఘటనపై విచారణ చేపట్టాలని మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు.