కోహ్లీ స్థానంలో గిల్.. పంత్ క్లారిటీ

కోహ్లీ స్థానంలో గిల్..తేల్చి చెప్పిన పంత్.

టెస్టు క్రికెట్‌ (Test Cricket)లో నాలుగో బ్యాటింగ్ (Fourth Batting) స్థానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. త్వరగా వికెట్లు పడినప్పుడు ఇన్నింగ్స్‌ను నిలబెట్టడం, అవసరమైనప్పుడు గేర్ మార్చి వేగంగా పరుగులు చేయడం ఈ స్థానం ప్రత్యేకత. జట్టుకు వెన్నెముక అయిన ఈ స్థానంలో భారత్ తరఫున క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఎన్నో టెస్టులు (179 టెస్టులు) ఆడాడు. సచిన్ రిటైర్మెంట్ అనంతరం కింగ్ విరాట్ కోహ్లీ (Virat Kohli) (99 టెస్టులు) ఆ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇప్పుడు కోహ్లీ కూడా టెస్టులకు వీడ్కోలు పలికాడు. దాంతో కింగ్ స్థానంలో ఆడేదెవరు? అనే ప్రశ్న అందరిలో ఉంది. మిడిలార్డర్‌లో అద్భుత బ్యాటింగ్‌తో టెస్టు మ్యాచ్ గమనాన్ని శాసించే అవకాశం ఉన్న ఈ కీలక స్థానంలోకి ఇప్పుడు కొత్త ప్లేయర్ వస్తున్నాడు.

కోహ్లీ స్థానంలో శుభ్‌మన్ గిల్: పంత్ క్లారిటీ
జూన్ 20 నుంచి ఇంగ్లండ్, భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ తొలి టెస్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కీలకమైన నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) వెల్లడించాడు. టెస్ట్ సిరీస్ (Test Series) ప్రారంభానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో పంత్ పాల్గొని పలు విషయాలపై స్పష్టత ఇచ్చాడు.

“బ్యాటింగ్ ఆర్డర్‌లో మూడో స్థానంలో ఎవరు ఆడతారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. 4, 5 స్థానాల్లో మాత్రం ఎవరు ఆడతారనే దానిపై క్లారిటీ వచ్చింది. ప్రస్తుతానికి గిల్ 4లో, నేను 5వ స్థానంలో ఆడతాము. మిగతా స్థానాల గురించి చర్చిస్తున్నాం” అని పంత్ చెప్పాడు.

గిల్-పంత్ కెమిస్ట్రీపై ధీమా
“మైదానం వెలుపల నాకు, శుభ్‌మన్ గిల్‌కు మంచి స్నేహం ఉంది. బయట మంచి స్నేహితులం అయినప్పుడు.. మైదానం లోపల కూడా దాని ఫలితం ఉంటుంది. మేమిద్దరం బాగా కలిసిపోతాం. మా ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది. మైదానంలో మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం” అని రిషభ్ పంత్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి టెస్టు మ్యాచ్‌తో పాటు మిగిలిన మ్యాచ్‌ల్లోనూ గిల్, పంత్ నాలుగు, ఐదు స్థానాల్లో ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విరాట్ కోహ్లీ స్థానంలో గిల్ ఆడాలని టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) గతంలోనే అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment