ఇంగ్లండ్ పర్యటనలో విఫలమైన టీమిండియా వెటరన్ కరుణ్ నాయర్పై వేటు పడనుందా? . గత ఏడేళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి తిరిగి వచ్చిన నాయర్, ఇంగ్లాండ్తో జరిగిన నాలుగు టెస్టుల్లో కేవలం 205 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.
దీంతో అతని స్థానంలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ను తిరిగి జట్టులోకి తీసుకురావాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్లో స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సిరీస్తో అయ్యర్ రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
శ్రేయస్ అయ్యర్ ప్రస్థానం
అయ్యర్ చివరిసారిగా 2024లో ఇంగ్లాండ్పైనే టెస్టు మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జట్టుతో పాటు సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో కూడా తన స్థానాన్ని కోల్పోయాడు. అయితే, దేశవాళీ టోర్నీలలో అద్భుతంగా రాణించి, మళ్ళీ జాతీయ జట్టులోకి వచ్చాడు. కానీ అప్పుడు అతనికి వన్డే జట్టులో మాత్రమే చోటు దక్కింది. 2025లో ఛాంపియన్స్ ట్రోఫీని భారత్ గెలుచుకోవడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అయినప్పటికీ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు అయ్యర్ను కాదని కరుణ్ నాయర్కు సెలెక్టర్లు అవకాశమిచ్చారు. నాయర్ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
సెలెక్టర్ల ఆలోచన
టీమ్ ఇండియాకు అయ్యర్ వంటి అనుభవజ్ఞుడైన మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అవసరం ఉందని ఒక బీసీసీఐ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాతో చెప్పారు. ముఖ్యంగా స్పిన్నర్లను అద్భుతంగా ఆడగల అయ్యర్, స్వదేశంలో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్లలో కీలకం అవుతాడని పేర్కొన్నారు. అయ్యర్ ఇప్పటివరకు 14 టెస్టుల్లో 36.86 సగటుతో 811 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలను బట్టి సెలెక్టర్లు అతడిని తిరిగి ఎంపిక చేయడం ఖాయమని ఆ అధికారి తెలిపారు.








