బంగ్లాదేశ్ కెప్టెన్సీకి షాంటో వీడ్కోలు..

బంగ్లాదేశ్ కెప్టెన్సీకి షాంటో వీడ్కోలు


ఊహించిందే జరిగింది. బంగ్లాదేశ్ క్రికెట్‌లో నజ్ముల్ హొస్సేన్ షాంటో కెప్టెన్గా ప్రస్థానం ముగిసింది. ఇప్పటికే టీ20, వన్డే కెప్టెన్సీని కోల్పోయిన షాంటో.. ఇప్పుడు టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నాడు. కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం షాంటో తన నిర్ణయాన్ని వెల్లడించాడు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)తో నెలకొన్న విభేదాల కారణంగానే షాంటో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

బీసీబీ షాక్: వ‌న్డే కెప్టెన్సీ కోల్పోయిన షాంటో
టీ20 కెప్టెన్సీ నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్న షాంటో, వన్డే, టెస్టుల్లో సారథిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. అయితే, బీసీబీ అతడికి ఊహించని షాకిచ్చింది. ఈ నెల 12న అత్యవసర సమావేశం ఏర్పాటు చేసిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు, అనూహ్యంగా వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి షాంటోను తప్పించింది. అతడి స్థానంలో స్టార్ ఆల్ రౌండర్ మెహదీ హసన్ ను వన్డే కెప్టెన్‌గా నియమించింది.

‘జట్టు శ్రేయస్సు కోసమే’
అప్పటి నుంచి షాంటో బీసీబీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే షాంటో టెస్టు కెప్టెన్సీని కూడా వదులుకున్నాడు. “ఇది వ్యక్తిగత నిర్ణయం కాదు. జట్టు శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాను. గత కొన్ని సంవత్సరాలుగా బంగ్లాదేశ్ డ్రెస్సింగ్ రూమ్‌లో భాగంగా ఉన్నాను. ముగ్గురు కెప్టెన్లు ఉండడం సమంజసం కాదని నేను భావిస్తున్నాను. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. దీనిపై బోర్డు ఆలోచన ఏంటో నాకు తెలియదు. ఏదేమైనప్పటికీ, వారి నిర్ణయానికి మద్దతు ఇస్తాను” అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో షాంటో పేర్కొన్నాడు.

కొత్త కెప్టెన్ ఎవరు?
ప్రస్తుతం బంగ్లాదేశ్ టీ20 కెప్టెన్‌గా లిట్టన్ దాస్ ఉండగా, వన్డే కెప్టెన్‌గా మెహదీ హసన్ ఇటీవల ఎంపికయ్యాడు. ఇప్పుడు షాంటో రాజీనామా చేయడంతో టెస్టు కెప్టెన్‌గా ఎవరు బాధ్యతలు చేపడతారో వేచి చూడాలి. శ్రీలంకతో తొలి టెస్టును డ్రాగా ముగించిన బంగ్లా టైగర్స్, రెండో టెస్టులో మాత్రం ఘోర ఓటమి చవిచూసింది. దీంతో రెండు మ్యాచ్ ల సిరీస్ ను బంగ్లాదేశ్ 0-1తో కోల్పోయింది.

Join WhatsApp

Join Now

Leave a Comment