తమకు ప్రభుత్వం (Government) ప్రకటించిన రాయితీలు (Incentives), బకాయిలు (Pending Dues) వెంటనే విడుదల చేయాలంటూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు (SC, ST Entrepreneurs) చేపట్టిన ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. ఈ క్రమంలో మంగళగిరిలోని ఏపీఐఐసీ బిల్డింగ్ (APIIC Building) ఎదుట ధర్నా చేస్తున్న పారిశ్రామికవేత్తలను పోలీసులు అరెస్టు చేయడం వివాదాస్పదంగా మారింది. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల అరెస్టును టీడీపీ(TDP) తిరువూరు ఎమ్మెల్యే (Tiruvuru MLA) కొలికపూడి శ్రీనివాసరావు (Kolikapudi Srinivasa Rao) తీవ్రంగా ఖండించారు. బకాయిల కోసం పోరాటం చేస్తున్న పారిశ్రామికవేత్తలను అరెస్టు చేయడం అన్యాయమని ఆయన మండిపడ్డారు.
ఆందోళన సమయంలో పలువురు ఎస్సీ, ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలు కన్నీటి పర్యంతమయ్యారు. “ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాత్రమే మేం కోరుతున్నాం. పెద్ద పెద్ద కంపెనీలకు వేల కోట్ల రూపాయల రాయితీలు, మాఫీలు ఇస్తున్న ప్రభుత్వం… మాకు మాత్రం ఎందుకు న్యాయం చేయడం లేదు?” అని పారిశ్రామిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు రూ.700 కోట్ల బకాయిల కోసం ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఆందోళనకు దిగారని ఎమ్మెల్యే కొలికపూడి తెలిపారు. వారి డిమాండ్ను తాను పూర్తిగా సమర్థిస్తున్నానని కొలికపూడి ప్రకటించారు. “బకాయిల కోసం కన్నీళ్లతో ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయడం సరికాదు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డీజీపీ(DGP)ని డిమాండ్ చేస్తున్నాను” అని ఆయన పేర్కొన్నారు.
సీఎం విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలతో కలిసి ముఖ్యమంత్రి వద్దకు వెళ్లి వారి సమస్యలను ప్రస్తావిస్తానని కూడా కొలికపూడి శ్రీనివాసరావు హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా స్థానిక ఎంపీపై పోరాటం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి.. తాజాగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తల అరెస్ట్పై ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తడం చర్చనీయాంశంగా మారింది.








ఆది ‘కమ్మగా’ వ్యాఖ్యలతో నాకు సంబంధం లేదు – ఏపీ బీజేపీ చీఫ్