ట్రైనీ డాక్టర్పై జరిగిన దారుణ హత్యాచారం యావత్ దేశాన్ని కదిలించింది. 2024 ఆగస్టులో కలకత్తా RG కర్ మెడికల్ కాలేజీలో జరిగిన ఈ ఘటనను చూసి దేశ ప్రజలంతా నివ్వెరపోయారు. మృతురాలికి న్యాయం చేయాలని ఆందోళన వ్యక్తం చేశారు. యావత్ దేశాన్ని కుదిపేసిన ఈ కేసులో సీల్దా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. సంజయ్ రాయ్ను దోషిగా తేలుస్తూ కీలక తీర్పు వెలువరించింది.
కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు CBI ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తు జరిగింది. సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్ను ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు. ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. మరోవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తిన ఈ కేసులో 120 మంది సాక్షులను సీబీఐ విచారించింది. నిందితుడికి మరణశిక్ష విధించాలని కోర్టులో వాదించింది. జనవరి 9న ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి.
నిర్భయ కేసును తలపించే దుశ్చర్య
నిర్భయ సంఘటనను గుర్తుకు తెచ్చేలా అభయ కేసు దేశవ్యాప్తంగా నిరసనలు, చర్చలు రేకెత్తించింది. ట్రైనీ డాక్టర్పై హత్యాచారం జరిగి నాలుగు రోజుల అనంతరం CBI రంగంలోకి దిగింది. అన్ని ఆధారాలను సేకరించిన అనంతరం దోషిని బయటపెట్టింది. దోషిగా తేల్చిన జడ్జి అనిర్బన్ దాస్, రాబోయే సోమవారం శిక్ష ఖరారు చేయనున్నారు.