సాగునీటి సంఘం ఎన్నికల కవరేజీకి వెళ్ళిన సాక్షి మీడియా ప్రతినిధులపై టీడీపీ కార్యకర్తలు దాడి జరిపిన ఘటన కలకలం రేపింది. వైఎస్సార్ జిల్లా వేముల తహసీల్దార్ కార్యాలయం వద్ద కవరేజీ చేస్తున్న మీడియా ప్రతినిధులపై సుమారు 50 మంది టీడీపీ మూకలు రాళ్ళు, కర్రలతో విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో సాక్షి రిపోర్టర్లు, కెమెరామెన్ గాయపడ్డారు. దాడిలో కెమెరా పూర్తిగా ధ్వంసమైంది.
జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
నీటి సంఘాల ఎన్నికల కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టులపై దాడికి పాల్పడిన వారిపై హత్యా యత్నం కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఏపీ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు, ఐజేయూ జాతీయ కార్యదర్శి సోమసుందర్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏచూరి శివ డిమండ్ చేశారు.
దాడిచేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఎన్నికల కవరేజీకి వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులపై ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వచ్చిన వారు మూకుమ్మడిగా దాడి చేసి గాయపరచడం దుర్మార్గమన్నారు. ఈ దాడిలో జర్నలిస్టుల సెల్ ఫోన్లను కూడా ధ్వంసమయ్యాయని, జర్నలిస్టులను పోలీసులు స్టేషన్కు తీసుకెళ్లారన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి దాడిచేసిన వారిపై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమండ్ చేశారు.