భారతదేశంలో (India) కరోనా కేసులు (Corona Cases) మళ్లీ కలవరపెడుతున్నాయి. రోజు రోజుకీ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ (Central Ministry of Health) వివరాల ప్రకారం, సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 257 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా కేరళ (Kerala), తమిళనాడు (Tamil Nadu), మహారాష్ట్ర (Maharashtra) రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య గత వారంతో పోలిస్తే స్వల్ప పెరుగుదలను సూచిస్తోంది. అయితే అధికారులు మాత్రం పరిస్థితి అదుపులో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు.
ఆసియాలో కరోనా విజృంభణ..
గత కొన్ని వారాలుగా సింగపూర్, హాంకాంగ్, చైనా, థాయిలాండ్లో కరోనా కేసులు గణనీయంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్లోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (NCDC), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), మరియు ఇతర కేంద్ర ఆసుపత్రుల నిపుణులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో, దేశంలోని కరోనా పరిస్థితిని అదుపులో ఉన్నట్లు నిర్ధారించారు. అయితే, దక్షిణ ఆసియా దేశాలలో పెరుగుతున్న కేసులు భారత్లో కూడా ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
JN.1 వేరియంట్: ప్రస్తుత పరిస్థితి
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా JN.1 వేరియంట్ దాని ఉప-వేరియంట్లు (LF.7 మరియు NB.1.8) ఎక్కువగా కనిపిస్తున్నాయి. భారత్లో నమోదవుతున్న కేసులు ఈ వేరియంట్తోనే సంబంధం కలిగి ఉన్నాయి. అయితే, ఈ కేసులన్నీ స్వల్ప తీవ్రతతోనే ఉన్నాయని, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని పేర్కొన్నారు. ఆసియా దేశాలలో పెరుగుతున్న కేసుల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎందుకంటే వ్యాధి నిరోధక శక్తి తగ్గడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.