‘నేనుండ‌గా కాంగ్రెస్‌లోకి క‌విత‌కు నో ఎంట్రీ’ – రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

'నేనుండ‌గా కాంగ్రెస్‌లోకి క‌విత‌కు నో ఎంట్రీ' - రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని తాజా ప‌రిస్థితులపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ కుటుంబం గురించి మీడియా చిట్‌చాట్‌లో రేవంత్ చేసిన కామెంట్స్ సంచ‌ల‌నంగా మారాయి. ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా కొత్త మంత్రుల శాఖల కేటాయింపు, కులగణన, నక్సలిజం, రాజకీయ ప్రత్యర్థులపై రేవంత్ కొన్ని కీల‌క వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ తిరిగి వెళ్లిన తర్వాత కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు చేస్తానని, ప్రస్తుతం తన వద్ద ఉన్న శాఖ‌ల‌ను వారికి కేటాయిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

తన ఢిల్లీ పర్యటన ఉద్దేశం తెలంగాణ మోడల్ కులగణనను కర్ణాటక ప్రభుత్వానికి వివరించడమేనని చెప్పారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌లతో రెండున్నర గంటల పాటు కులగణనపై చర్చించినట్లు వివ‌రించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవితపై తీవ్ర విమర్శలు చేశారు. “నేను ముఖ్యమంత్రిగా ఉన్నంతవరకు కవితకు కాంగ్రెస్‌లో ప్రవేశం లేదు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణకు పట్టిన కొరివి దయ్యాలు. కవిత చేస్తున్నదంతా అసెంబ్లీ రౌడీ సినిమా తరహా డ్రామా” అని విమర్శించారు.

అదేవిధంగా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కూడా విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డి తెలంగాణ కోసం ఒక్క రోజు కూడా సమీక్ష నిర్వహించలేదని, రీజినల్ రింగ్ రోడ్డు సహా అనేక ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ భూసేకరణను తానే క్లియర్ చేశానని, దీనికి కిషన్ రెడ్డి సహకారం లేదన్నారు.

నక్సలిజం అంశంపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. “సామాజిక అంతరాలు ఉన్నంతవరకు నక్సలిజం ఉంటుంది. ఇది ఎప్పటికీ అంతం కాదు. ప్రస్తుతం కొంత తగ్గినప్పటికీ, వివిధ రూపాల్లో మళ్లీ ఉద్భవిస్తుంది” అని అన్నారు. గతంలో ఆయన పీస్ డైలాగ్ కమిటీ సభ్యులతో జరిపిన సంభాషణలో కూడా ఈ అంశంపై తన వైఖరిని వెల్లడించారు. అలాగే, తాను డ్రాప్ అవుట్ స్టూడెంట్ కాదని, “ఎలివేషన్ అయ్యాను” అని చమత్కరించారు. మీడియా చిట్‌చాట్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన‌ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలలో కొత్త చర్చలకు దారితీసే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment