తిరుమలలో ఎవరూ ఊహించని ఘోరం జరిగింది. కొండపై కొలువైన కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చిన దంపతులు తిరుమల కాటేజీలోనే ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయుడు (60), ఆయన భార్య అరుణ (55) తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వచ్చారు. నందకం గెస్ట్ హౌస్లోని 203 గదిని అద్దెకు తీసుకున్నారు. ఇంతలో ఏమైందో తెలియదు కానీ, ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి వచ్చి కాటేజీ గది అద్దెకు తీసుకొని అందులో ఆత్మహత్య చేసుకోవటం, దంపతులిద్దరూ తిరుమలలో చనిపోవాలని నిర్ణయించుకోవటం చర్చనీయాంశంగా మారింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకని మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసులు, అరుణ మృతిచెందిన వార్తను కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.







