ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League) 2025లో ఆర్సీబీ (RCB) కీలక విజయాన్ని అందుకుంది. 17 ఏళ్ల తరువాత చెన్నై హోంగ్రౌండ్లో సీఎస్కే (CSK)పై ఆర్సీబీ విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చెన్నైలోని చపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)పై 50 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో 2008 తర్వాత చెన్నైలో ఆర్సీబీకి ఇది తొలి విజయం (First Win) కావడం విశేషం.
ఆర్సీబీ ఇన్నింగ్స్..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీ, 196 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. కెప్టెన్ రజత్ పటీదార్ (Rajat Patidar) 32 బంతుల్లో 51 పరుగులతో జట్టును నడిపించారు. ఓపెనర్ ఫిల్ సాల్ట్ (Phil Salt)16 బంతుల్లో 32 పరుగులు చేసి శుభారంభం ఇచ్చాడు. చివర్లో టిమ్ డేవిడ్ (Tim David) 8 బంతుల్లో 22 పరుగులు చేసి స్కోరును మరింత పెంచాడు. సీఎస్కే బౌలింగ్లో నూర్ అహ్మద్ (Noor Ahmad) 36 పరుగులిచ్చి 3 వికెట్లు తీశారు. మతీషా పతిరానా (Matheesa Pathirana) 36 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. అయితే, ఆర్సీబీ బ్యాట్స్మెన్ను నియంత్రించడంలో బౌలర్లు విఫలమయ్యారు.
సీఎస్కే ప్రదర్శన..
197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే(CSK), ప్రారంభంలోనే వికెట్లు కోల్పోయింది. రచిన్ రవీంద్ర (Rachin Ravindra) 41 పరుగులతో మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే, మిగతా బ్యాట్స్మెన్ ఆర్సీబీ (RCB) బౌలింగ్కు ఎదురులేకపోయారు. చివర్లో మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) 30 పరుగులు చేసి అభిమానులకు కొంత సాంత్వన ఇచ్చాడు. ఆర్సీబీ బౌలింగ్లో జోష్ హేజల్వుడ్ 21 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. యశ్ దయాల్ 18 పరుగులిచ్చి 2 వికెట్లు, లియామ్ లివింగ్స్టోన్ 2 వికెట్లు తీసి సీఎస్కే బ్యాటింగ్ను దెబ్బతీశారు.
ముఖ్యాంశాలు..
ఫిల్ సాల్ట్ తొలి ఓవర్లలోనే దూకుడుగా ఆడి జట్టుకు శుభారంభం ఇచ్చాడు. రజత్ పటీదార్ అర్ధశతకంతో జట్టును స్థిరంగా నడిపించాడు. టిమ్ డేవిడ్ చివరి ఓవర్లలో వరుస సిక్సులతో స్కోరును పెంచాడు. జోష్ హేజల్వుడ్ సీఎస్కే టాప్ ఆర్డర్ను తక్కువ స్కోరుకే పెవిలియన్ పంపాడు.