ఏపీలో రేవ్ పార్టీ కల్చర్ పెరుగుతోంది. మొన్నటికి మొన్న జనసేన నేత తన పుట్టిన రోజు సందర్భంగా యువతులు, హిజ్రాలతో అశ్లీల నృత్యాలు చేయించిన ఘటన మరువక ముందే.. తూర్పు గోదావరి జిల్లా బూరుగుపూడిలో నిర్వహించిన రేవ్ పార్టీ స్థానికంగా సంచలనంగా మారింది. ఒక కల్యాణమండపంలో రాత్రంతా మందు, విందు, డాన్స్లతో జరిపిన ఈ రేవ్ పార్టీ తెల్లవారుజామున పోలీసులు దాడి చేయడంతో ముగిసింది. ఈ దాడిలో ఐదుగురు యువతులు, 14మంది యువకులు అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. విచారణలో వీరు స్థానిక పురుగుమందుల షాపుల యజమానులతో సంబంధమున్నవారిగా గుర్తించారు.
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఒక ఫర్టిలైజర్స్ కంపెనీ ఈ రేవ్ పార్టీని నిర్వహించినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేలినట్లు చెబుతున్నారు. రేవ్ పార్టీలో ఖరీదైన మద్యం బాటిళ్లను గుర్తించారని, వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టబడినవారంతా ఫర్టిలైజర్స్ కంపెనీ యజమానులని, వీరంతా కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినట్లు తెలిసింది.
ఈ ఘటన స్థానిక ప్రజల్లో ఆందోళన రేపింది. కల్యాణమండపాలు ఇలా అనైతిక కార్యకలాపాలకు వేదిక కావడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ ఘటనపై మరింత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.