‘ఏడు త‌రాలు గుర్తుండిపోయేలా చంపేస్తాం’ – ర‌ణ్‌వీర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్‌

'ఏడు త‌రాలు గుర్తుండిపోయేలా చంపేస్తాం' - ర‌ణ్‌వీర్‌కు బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్‌

రణ్‌వీర్ సింగ్‌ను లక్ష్యంగా చేసుకుని బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి తీవ్ర బెదిరింపులు రావడం బాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. ఇటీవల రణ్‌వీర్ సింగ్ హీరోగా విడుదలైన ధురంధర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తూ మంచి ఆదరణ పొందుతున్న నేపథ్యంలో ఈ బెదిరింపులు రావడం గమనార్హంగా మారింది. పాకిస్థాన్, గల్ఫ్ దేశాలు మినహా దాదాపు అన్ని ప్రాంతాల్లో సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

ఈ క్రమంలో తాజాగా రణ్‌వీర్ సింగ్‌కు వాట్సాప్ ద్వారా వార్నింగ్ ఆడియో మెసేజ్‌లు వచ్చాయి. హ్యారీ బాక్సర్ అనే వ్యక్తి తనను తాను బిష్ణోయ్ గ్యాంగ్ ఫాలోవర్‌గా పరిచయం చేసుకుంటూ, రణ్‌వీర్ సింగ్‌ను మాత్రమే కాకుండా ఆయన వద్ద పనిచేస్తున్న సిబ్బందిని కూడా చంపేస్తామని బెదిరించాడు. తమ డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాడు.

బెదిరింపులు అక్కడితో ఆగకుండా, రణ్‌వీర్ సింగ్‌ను “ఏడుతరాలు గుర్తుండిపోయేలా చంపేస్తాం” అంటూ అత్యంత హింసాత్మక వ్యాఖ్యలు చేశాడు. రణ్‌వీర్ దగ్గర పనిచేసే వారి లిస్ట్, ఆయనను కలవడానికి వచ్చే వ్యక్తుల వివరాలన్నీ తమ వద్ద ఉన్నాయని చెప్పిన హ్యారీ బాక్సర్, ఒక్కొక్కరినీ టార్గెట్ చేసి చంపితే అప్పుడైనా తమ శక్తి ఏంటో అర్థమవుతుందని హెచ్చరించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

అదేవిధంగా ధురంధర్ దర్శకుడు రోహిత్ శెట్టికి కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. తమ హెచ్చరికలను పట్టించుకోకుండా ఇతరులకు ఉచిత సలహాలు ఇవ్వడం మానుకోవాలని కూడా ఆడియో మెసేజ్‌లో పేర్కొనడం గమనార్హం.

ఈ ఘటనపై బాలీవుడ్ వర్గాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. రణ్‌వీర్ సింగ్ భద్రతపై ఆందోళన వ్యక్తమవుతుండగా, పోలీసులకు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగా బెదిరింపులు ఎదుర్కొన్న నేపథ్యంలో, ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment