బాలీవుడ్ (Bollywood)లో తెరకెక్కుతున్న ‘రామాయణ’ (‘Ramayan’) చిత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ (Visuals) అద్భుతంగా ఉన్నాయని, గ్రాఫిక్స్ (Graphics) పనితీరుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమా భారతదేశంలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా రికార్డు సృష్టించనుంది. మానవ సమాజ గమనాన్నే ప్రభావితం చేసిన రామాయణం వంటి మహత్తర కావ్యంపై ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అయితే, దర్శకుడు నితేశ్ తివారీ (Nitesh Tiwari) గ్రాఫిక్స్ వర్క్ (Graphics Work)ను ప్రధాన బలంతో వెండితెరపై ఒక అద్భుతాన్ని చూపించబోతున్నారు. రామాయణం ఒక మధురమైన కథ. ఎన్నిసార్లు చదివినా, విన్నా కొత్తగా అనిపిస్తుంది. అందుకే ఇది ఇప్పటికే పలుమార్లు సినిమాగా రూపొందింది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్లో ‘రామాయణ’ పేరుతో అత్యంత భారీ బడ్జెట్తో ఈ సినిమా వస్తోంది.
భారతీయ సినీ చరిత్రలో అత్యంత బడ్జెట్ చిత్రం ‘రామాయణ’
“అన్ని యుద్ధాల్ని అంతం చేసే యుద్ధం మొదలైంది” అని తాజాగా విడుదలైన రామాయణ గ్లింప్స్లో మేకర్స్ పేర్కొన్నారు. అదేవిధంగా, ఈ చిత్రంతో బాక్సాఫీస్ రికార్డులు అన్నీ అంతం కావడమే కాకుండా, కొత్త రికార్డులు మొదలవుతాయని భావిస్తున్నారు. రామాయణ పార్ట్-1 కోసం ఏకంగా రూ. 835 కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో దేశంలోనే అత్యంత ఖరీదైన సినిమాగా ‘రామాయణ’ చరిత్ర సృష్టించింది. రాకింగ్ స్టార్ యశ్ నిర్మాణ సంస్థ (Yash Production Company) మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ (Monster Mind Creations), అలాగే నమిత్ మల్హోత్రా (Namit Malhotra) నిర్మాణ సంస్థ ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ (Prime Focus Studios) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇప్పటివరకు అత్యధిక బడ్జెట్ చిత్రాలుగా నిలిచిన కల్కి 2898 ఏడీ (రూ. 600 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ. 550 కోట్లు), ఆదిపురుష్ (రూ. 550 కోట్లు) వంటి చిత్రాలను ‘రామాయణ’ అధిగమించింది.
భారీ తారాగణం
‘రామాయణ’ సినిమాలో రాముడి పాత్రలో బాలీవుడ్ స్టార్ రణ్బీర్ కపూర్ (Ranbir Kapoor), సీత పాత్రలో సాయి పల్లవి (Sai Pallavi) నటిస్తున్నారు. లంకాధిపతి రావణుడి పాత్రలో ‘కేజీఎఫ్’ ఫేమ్ యశ్(Yash) కనిపించనున్నారు. రవి దూబే (లక్ష్మణుడు), సన్నీ డియోల్ (ఆంజనేయుడు)గా కనిపించనున్నారు. వీరితో పాటు వివేక్ ఒబెరాయ్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, షీబా చద్దా వంటి సూపర్స్టార్స్ ఈ మూవీ కోసం పనిచేస్తున్నారు. దంగల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నితేశ్ తివారీ దర్శకత్వంలో ఈ భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది.