టాలీవుడ్ (Tollywood) సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇటీవల కాలంలో తన సినిమాలతో పాటు వివాదాస్పద వ్యాఖ్యలతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. సినిమా ఈవెంట్స్, ఇంటర్వ్యూలలో ఆయన చేసే కామెంట్స్ తరచూ కాంట్రవర్సీకి దారితీస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మరోసారి అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యారు.
తెలుగు సినీ పరిశ్రమలో దశాబ్దాలుగా అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసు గెలుచుకున్న రాజేంద్రప్రసాద్, ఈ మధ్యకాలంలో తన వ్యాఖ్యలతో వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్నారు. సీనియర్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి (S. V. Krishna Reddy) పుట్టినరోజు (Birthday) వేడుక సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో తనికెళ్ల భరణి, మురళీమోహన్, శ్రీకాంత్, రోజా, ఆమని, ఇంద్రజ, లయ, రవళి, బ్రహ్మానందం, అలీ, ఉత్తేజ్, శివాజీ రాజా తదితరులు హాజరయ్యారు.
ఈ వేడుకలో మాట్లాడుతూ రాజేంద్రప్రసాద్, సహనటుడు అలీ (Ali)ని ఉద్దేశించి అసభ్య పదజాలంతో (Vulgar Words) వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారి, ఆయనపై విమర్శలకు కారణమయ్యాయి. అదే సమయంలో, తనకు ఎన్టీఆర్ అవార్డు వచ్చినట్లు పేర్కొన్నప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొట్టకపోవడంతో, “బుద్ధి ఉందా? అవార్డు అంటే చప్పట్లు కొట్టరా?” అంటూ కోపంగా స్పందించారు. అంతేకాక, స్టేజ్పై ఉన్న అచ్చిరెడ్డిని ఉద్దేశించి, “బయటకు రా, నీ సంగతి తేలుస్తా” అని హెచ్చరికలు జారీ చేశారు.
రాజేంద్రప్రసాద్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారడంతో, ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..