ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా మధురపూడిలోని రాజమండ్రి ఎయిర్పోర్టులో శుక్రవారం ఒక ప్రమాదకర సంఘటన జరిగింది. కొత్తగా నిర్మాణంలో ఉన్న టెర్మినల్లో కొంత భాగం విరిగిపడింది. అదృష్టవశాత్తు, ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు అక్కడ లేనందున ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఇటీవలే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ నిర్మాణ పనులను పరిశీలించినట్లు సమాచారం.
రాజమండ్రి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాను కల్పించేందుకు 2023 వైఎస్ జగన్ హయాంలో నాటి కేంద్ర విమానాయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కొత్త టెర్మినల్ భవన పనులకు భూమిపూజ చేశారు. సుమారు రూ. 350 కోట్లతో ఈ పనులు కొనసాగుతున్నాయి. అకస్మాత్తుగా టర్మినల్ కొత్తభాగం కూలిపోవడంతో ఎయిర్పోర్టు నిర్మాణ పనుల్లోని నాణ్యత ప్రమాణాలపై ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. అయితే ఈ ఘటనకు గల అసలు కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.