ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో అనాటమీ విద్యార్థుల శిక్షణ కోసం మృతదేహాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ, శవాల కొరత ఇప్పుడు ఆ కాలేజీల యాజమాన్యాన్ని వేధిస్తోంది. విద్యార్థులు మానవ శరీరంలోని అవయవాల గురించి అవగాహన పెంచుకొని ఏయే ఆరోగ్య సమస్యకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనే దానికి మృతదేహంపై ఎక్స్పర్మెంట్ చేయించడం కంపల్సరీ అని సినిమాల్లోనూ చూశాం. శవాల కొరతను ఆసరాగా చేసుకొని ప్రైవేట్ కాలేజీలకు మృతదేహాలను అందించేందుకు దళారులు చట్టవిరుద్ధమైన దందాను నడుపుతున్నారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో మృతదేహానికి రూ.1 లక్ష వరకు చెల్లించేందుకు కొన్ని కాలేజీలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
ఈ అక్రమ వ్యాపారం ప్రధానంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు గ్రామాల్లో విస్తరిస్తోంది. నిరుపేద కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని, “అంత్యక్రియల ఖర్చు తగ్గుతుంది, పైగా డబ్బు కూడా వస్తుంది” అంటూ ఆశపడేలా చేసి మృతదేహాలను సేకరిస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఈ విధానం మానవత్వానికి విరుద్ధంగా ఉండటమే కాక, నీతి నియమాలను ఉల్లంఘిస్తూ సమాజంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఈ దందా నిరుపేదల ఆర్థిక బలహీనతను దోపిడీ చేస్తూ, మృతదేహాలను వస్తువులుగా మార్చడం ద్వారా తీవ్రమైన ధార్మిక, సామాజిక ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ సమస్యను అరికట్టేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వం, మెడికల్ కాలేజీలు, సమాజం సమష్టిగా ఈ అక్రమాలను నిరోధించడంతో పాటు, శవదానం వంటి చట్టబద్ధమైన ప్రక్రియలను ప్రోత్సహించాలని నిపుణులు సూచిస్తున్నారు.