సినీ నటుడు, ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పోసాని కృష్ణమురళి జైలు నుంచి విడుదల విషయంపై గందరగోళం కొనసాగుతోంది. కోర్టు బెయిల్ ఇచ్చినా, ఆయన బయటకు రావడం ఇంకా అనుమానంగానే ఉంది. అన్నీ కేసుల్లోనూ బెయిల్ పొందిన పోసాని ఇవాళ విడుదలకు సిద్ధం అవుతుండగా, గుంటూరు సీఐడీ పోలీసులు పోసానిపై పీటీ వారెంట్ జారీ చేశారు. ఈ కారణంగా ఆయన విడుదలపై ఇంకా క్లారిటీ రాలేదు. గుంటూరు సీఐడీ పోలీసులు ఇప్పటికే కర్నూలు జిల్లా జైలుకు చేరుకున్నారు. పీటీ వారెంట్ మేరకు పోసానిని గుంటూరు కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. వర్చువల్గా జడ్జి ఎదుట ఆయనను ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
విడుదలపై ఇంకా సందిగ్ధత
పోసాని కృష్ణమురళిపై నమోదైన కేసుల్లో ఇప్పటికే బెయిల్ లభించినప్పటికీ, గుంటూరు సీఐడీ చొరవతో పరిస్థితి మరో మలుపు తిరిగింది. ఆదోని కేసులో కర్నూలు కోర్టు మేజిస్ట్రేట్ పోసానికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, గుంటూరు సీఐడీ తాజా చర్యతో ఆయన విడుదలపై నీలినీడలు కమ్ముకున్నాయి. పోసానిని కర్నూలు నుంచి గుంటూరుకు తరలించే అవకాశాలున్నాయి. వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసేందుకు కోర్టు విచారణను నేటికి వాయిదా వేసింది.