నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) సంచలన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచింది. ఇన్స్టాగ్రామ్ (Instagram) వేదికగా రెండు ఆసక్తికర పోస్టులు షేర్ చేసిన ఆమె, టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas)పై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్పై గతంలో తాను చేసిన ఫిర్యాదు పూర్తిగా నిజమేనని పూనమ్ స్పష్టం చేశారు.
“నా దగ్గర అన్ని ఆధారాలు (Evidence) ఉన్నాయి. త్రివిక్రమ్ను రాజకీయ నేత (Political Leader) కాపాడుతున్నారు. ఇదివరకు ఫిర్యాదు చేసిన విషయాన్ని మళ్లీ తెలియజేస్తున్నాను. నేను ఈ-మెయిల్ (Email) ద్వారా అధికారికంగా ఫిర్యాదు చేశాను. ఝాన్సీ (Jhansi) తో మాట్లాడినప్పుడు మీటింగ్ పెడదాం అన్నది నిజమే. కానీ, కొంతకాలం తరువాత ఆమె ‘నన్ను డిస్టర్బ్ చేయవద్దు’ అని చెప్పడం ఆశ్చర్యపరిచింది” అంటూ పూనమ్ పేర్కొంది.
త్రివిక్రమ్పై తనకు ఫిర్యాదు ఉందని, తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని పూనమ్ సంచలన వ్యాఖ్యలు చేసింది. త్రివిక్రమ్పై తన ఆరోపణలతో పాటు, ఝాన్సీతో తన చాటింగ్ స్క్రీన్షాట్లను (Chatting Screenshots) కూడా పూనమ్ బహిర్గతం చేసింది. ఈ పరిణామంతో గతంలో కొంతకాలంగా మౌనంగా ఉన్న ఈ అంశం మళ్లీ మీడియాలోకి వచ్చేసింది.
ఇంతకుముందు త్రివిక్రమ్పై MAA (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్)కు పూనమ్ సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదు చేసినా, సంఘం స్పందించలేదని ఆమె ఆరోపించారు. “నా జీవితాన్ని నాశనం చేసి, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని హరించిన త్రివిక్రమ్పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పైగా ఇండస్ట్రీ పెద్దల మద్దతుతో ఆయన్ని కాపాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి” అంటూ పూనమ్ వాపోయారు. పూనమ్ ఇన్స్టా పోస్ట్ టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. మరి ఇప్పటికైనా పూనమ్ కంప్లయింట్ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, ఝాన్సీ పరిగణనలోకి తీసుకుంటాయా..? మీటింగ్ ఏర్పాటు చేసిన త్రివిక్రమ్ వివరణ కోరతాయా..? అనేది వేచి చూడాలి.









