అమరావతి సంబరాలు జరపాలన్న సర్కారు ఆలోచనకు స్పందన కరువైంది. జనం విముఖత చూపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు పార్లమెంటులో ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరపాలని చంద్రబాబు సర్కారు నిన్న ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు కలెక్టర్లు, మెప్మా అధికారులు, సచివాలయ సిబ్బందికి చంద్రబాబు ప్రభుత్వం నిన్న హుకుం జారీ చేసింది. నిర్బంధంగా సిబ్బంది అందరూ సంబరాలు జరిపేలా చూడాలని, వాయిస్ మెసేజులు, వాట్సప్ మెసేజులతో హోరెత్తించింది. సోషల్ మీడియాలో ట్యాగ్స్ చేసి ఆ సంబరాల విజువల్స్, ఫొటోలు పోస్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
బాబు సర్కార్కు జనం షాక్
కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రాజధాని అమరావతి సంబరాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. కలెక్టర్లు, మెప్మా అధికారులు, సచివాలయ సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా, క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి ఆశించిన స్పందన రాకపోవడం చంద్రబాబు ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. రాజధాని ఉత్సవాలు నిర్వహించి, వాటిని సోషల్ మీడియాలో భారీగా ప్రమోట్ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, వాస్తవ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆదేశాలు ఇచ్చినా ఎవరూ ముందుకు రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. అమరావతిని తమ సెంటిమెంట్గా మార్చుకోవాలన్న చంద్రబాబు పన్నాగం జనానికి అర్థం కావడంతో ప్రభుత్వ పిలుపునకు ఆదరణ కరువైంది.
రూ.2 లక్షల కోట్లు ఎందుకు?
మౌలిక సదుపాయాలు (డ్రైనేజీ, మంచినీరు, కరెంట్) కూడా లేని చోట రూ. 2 లక్షల కోట్లు ఖర్చు చేయడంపై సామాన్యుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఒకే చోట అభివృద్ధిని కేంద్రీకరించడం వల్ల పాత తప్పులే పునరావృతం అవుతాయని జనం భావిస్తున్నారు. ఎన్నికల సమయంలో అమరావతిని ‘సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ’ అని, ఆదాయాన్ని సృష్టించే బాండాగారమని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు అదే రాజధాని పేరుతో వేల కోట్ల అప్పులు తెస్తుండటం విజ్ఞులైన ప్రజలను ఆలోచనలో పడేస్తోంది. ఈ అప్పుల భారం భవిష్యత్తులో తమపైనే పడుతుందనే ఆందోళన సర్వత్రా కనిపిస్తోంది.
ఏపీలో ‘మావిగన్’ ట్రెండ్!
అమరావతిపై వ్యతిరేకత పెరుగుతున్న వేళ, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ కాన్సెప్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు (MA-VI-GAN) ప్రాంతాలను కలుపుతూ 110 కిలోమీటర్ల మేర రాజధానిని అభివృద్ధి చేయాలనేది జగన్ ప్రతిపాదన. ప్రస్తుతం ఈ ప్రాంతం రాష్ట్రానికి 16 శాతం ఆదాయాన్ని అందిస్తోంది. సహజసిద్ధమైన వనరులు, పోర్టులు, కనెక్టివిటీ ఉన్న ఈ ప్రాంతాన్ని క్యాపిటల్గా డిక్లేర్ చేస్తే అది భవిష్యత్తులో రాష్ట్రానికి అసలైన ఆర్థిక ఇంజిన్గా మారుతుందని జగన్ వివరించారు.
అనుసంధానించడం మేలు
ఏమీలేనిచోట నుంచి రాజధానిని నిర్మించడం కంటే, ఇప్పటికే ఆదాయాన్ని ఇస్తున్న ప్రాంతాలను అనుసంధానించడం మేలని సామాన్యులు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం జగన్ ప్రతిపాదనను హేళన చేస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ‘మావిగన్’కు అనూహ్య మద్దతు లభిస్తోంది. హైదరాబాద్ అనుభవాల తర్వాత కూడా అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించాలని చూడటం చంద్రబాబు పాలకుల వైఫల్యంగా కనిపిస్తోంది. అమరావతి సంబరాలకు జనం ముఖం చాటేయడం బాబు సర్కార్కు హెచ్చరిక లాంటిదే. ఇప్పటికైనా వాస్తవాలను గ్రహించి ఆదాయాన్ని ఇచ్చే ‘మావిగన్’ వంటి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే చర్చ గట్టిగా నడుస్తోంది.
బాబు కుట్రలను తిప్పికొట్టిన ప్రజలు
చంద్రబాబు తొలి నుంచి అమరావతి పేరిట చేస్తున్న హడావిడిపై ప్రజాగ్రహం వ్యక్తమవుతోంది. ఇది 2019 ఎన్నికల్లో స్పష్టంగా బహిర్గతమైంది. ఇప్పుడు కూడా మళ్లీ అధికారం చేపట్టిన చంద్రబాబు మనసు మార్చుకోకుండా చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అమరావతి పేరిట చేస్తున్న మోసాన్ని ప్రజలు గ్రహించారని, ఇది గ్రహించారనడానికి అమరావతి సంబరాలు అట్టర్ ప్లాప్ కావడమే నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు.








