గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అప్రజాస్వామిక విధానాలకు పాల్పడిందని పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్షణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నాయకులు గుంటూరు, బాపట్ల, పల్నాడు ప్రాంతాల్లోని పోలింగ్ బూత్లలో భారీస్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారన్నారు. పీడీఎఫ్ తరఫున కేఎస్ లక్ష్మణరావు ఉమ్మడి కృష్ణా-గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. పోలింగ్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
వెల్దుర్తి, దుర్గి, బెల్లంకొండ బూత్లలోని పీడీఎఫ్ ఏజెంట్లను అధికార పార్టీ నాయకులు బయటకు గెంటేశారని కేఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. బెల్లంకొండలో తమ ఏజెంట్పై దాడి చేసి ఆయనపైనే అక్రమ కేసు పెట్టారన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలింగ్ బూత్లలో యథేశ్చగా తిరుగుతూ దొంగ ఓట్లను ప్రోత్సహించారని మండిపడ్డారు. తెనాలిలోని కోరంటి శివయ్య మున్సిపల్ హైస్కూల్లోని ఏడు బూత్లలో పెద్ద ఎత్తున దొంగ ఓట్ల వేసేందుకు అధికార పార్టీల నాయకులు ప్రయత్నించారన్నారు. మంగళగిరిలో పోలింగ్ బూత్ గేట్ వద్ద ప్రచారం చేశారని, ఇదంతా జరుగుతుంటే అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచే సత్తాలేక కుట్రలకు పాల్పడ్డారని, ప్రజల మద్దతు, గ్రాడ్యుయేట్ల మద్దతు లేకపోవడంతో జావకారిపోయి అక్రమ పద్ధతులకు తెగబడ్డారని కేఎస్ లక్ష్మణరావు ధ్వజమెత్తారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహజంగా 60 శాతం కంటే ఎక్కువ పోలింగ్ జరగదని, కానీ కొన్ని ప్రాంతాల్లో 90 శాతం కన్నా ఎక్కువ పోలింగ్ నమోదవ్వడం అనుమానాలకు తావిస్తోందన్నారు. దీనికి బూత్ క్యాప్చరింగ్ కారణమన్నారు. ఒక ప్రణాళిక బద్ధంగా దౌర్జన్యానికి పాల్పడి ఈ ఎన్నికల్లో అధికార పార్టీ దొంగ ఓట్లు వేయించిందని, దీనిపై రీపోలింగ్ అడుతామన్నారు.