తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి ఆయన పార్టీపై విస్తృత చర్చ జరుగుతోంది. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తూ తన పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేపడుతున్న విజయ్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
ఇప్పటివరకు ఈ అంశంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించలేదు. కానీ తాజాగా, ఓ తమిళ మీడియా ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ తొలిసారి విజయ్ పార్టీపై మాట్లాడారు. “విజయ్ అంటే నాకు గౌరవం ఉంది. కానీ ఆయన పార్టీ గురించి నేను ప్రత్యేకంగా ఫోకస్ చేయలేదు. రాజకీయ ప్రయాణం కఠినమైనది. అతనికి మంచి జరగాలని కోరుకుంటా” అంటూ వ్యాఖ్యానించారు.
అంతేకాదు, జనసేన తమిళనాడుకు విస్తరించే అవకాశముందా? అనే ప్రశ్నకు పవన్ కల్యాణ్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. “నేను ఏదీ ముందుగా ప్లాన్ చేయను. కానీ తమిళ ప్రజలు కోరుకుంటే తప్పకుండా పార్టీని విస్తరిస్తాను” అని స్పష్టం చేశారు.