టాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన “OG” విడుదలకు ముందు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈనెల 25న విడుదల కానున్న “OG” సినిమాకు పది రోజులు టికెట్ ధరలు (Ticket Prices) పెంచుకోవడంతో పాటు ప్రత్యేక బెనిఫిట్ షో (Benefit Show)కు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలకు ముందురోజు అర్ధరాత్రి ఒంటి గంటకు ఒక బెనిఫిట్ షో నిర్వహించుకోవడానికి అనుమతించిన ప్రభుత్వం.. బెన్షిట్ టికెట్ ధర రూ.1000గా నిర్ణయించింది. అలాగే, సాధారణంగా అమలులో ఉన్న టికెట్ ధరలను మించి భారీ పెంపు కూడా ప్రకటించింది.
ఒక బెన్షిట్ టికెట్ ధర రూ.1000, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఒక్కో టికెట్ ధరపై అదనంగా రూ.125 (GST), మల్టీప్లెక్స్లలో ఒక్కో టికెట్ ధరపై అదనంగా రూ.150 (GST)గా నిర్ణయించింది. ఈ పెంచిన టికెట్ ధరలు ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అమలులో ఉండనున్నాయి.
కూటమి ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ నిర్ణయం నెట్టింట వివాదాస్పదంగా మారుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమాలకు మాత్రమే ప్రత్యేక బెన్ఫిట్ షోలు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఏ ఇతర సినిమాలకు ఇలాంటి బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వకపోయినా, పవన్ కళ్యాణ్ సినిమాల కోసం మాత్రం అనుమతులు మంజూరు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ విషయం రాజకీయం వైపు కూడా మళ్లీ.. పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేరు కానీ, పవన్ సినిమాలకు టికెట్ ధరలు పెంచుతారా..? అని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.








